Jana Sena party expels MLA Arava Sridhar: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఎట్టకేలకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొంది. అంతేకాదు, ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో పార్టీ ఓ అంతర్గత కమిటీని నియమించింది. టి.శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ వంటి పార్టీ కీలక నేతలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. లైంగిక ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేలిన తర్వాతే కమిటీ పార్టీకి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక అందిన అనంతరం, శ్రీధర్ను పార్టీలో ఉంచాలా? తొలగించాలా? అనేది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఈ విచారణ పూర్తి అయ్యేంత వరకు ఎమ్మెల్యే శ్రీధర్పై తాత్కాలికంగా వేటు వేస్తున్నట్లు జనసేన విడుదల చేసిన లేఖలో స్పష్టం చేసింది. విచారణ కమిటీ తన నివేదికను సమర్పించి, పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని జనసేన పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. pic.twitter.com/Qw9ydOidyg
— JanaSena Party (@JanaSenaParty) January 28, 2026
అసలు ఏం జరిగిందంటే?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ దళిత మహిళ లైంగిక ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. శ్రీధర్ కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. అయితే, ఈమె కంటే ముందు మరో ఏడుగురిపై కూడా ఎమ్మెల్యే అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ శ్రీధర్పై తాత్కాలిక వేటు విధించించింది. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకోనుంది.

