JP Narayan Reaction On AP Google Hub : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన గూగుల్ ఏఐ హబ్ విజయంపై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటుకు చొరవ చూపడం గొప్ప విజయమని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థలో ఈ చారిత్రక ఒప్పందం విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలిపారు.
జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, “గూగుల్ హబ్ ఏర్పాటు కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశ డిజిటల్ ప్రగతికి కీలకం. ఇది టెక్ రంగంలో ఏపీకి కొత్త దిశను తెరుస్తుంది” అన్నారు. ఈ చర్యలు రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్గా మార్చుతాయని, యువతకు అనేక అవకాశాలు తీసుకువస్తాయని చెప్పారు. అయితే, ఆర్థిక పరిస్థితిపై కీలక సూచనలు చేశారు. పెట్టుబడులు ఆకర్షించడం, మౌలిక వసతులు నిర్మించడం ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అంతే అవసరమని నొక్కిచెప్పారు. “రాబోయే కొన్నేళ్లు రెవెన్యూ వ్యయాన్ని ఫ్రీజ్ చేయాలి. పన్నుల ఆదాయం పెరిగిన తర్వాత అనవసర ఖర్చులు నియంత్రించి, అప్పులను అదుపులోకి తీసుకురావాలి” అని సలహా ఇచ్చారు.
రాష్ట్ర అప్పులు, బడ్జెట్యేతర రుణాలు, చెల్లించని బిల్లులు కలిపి GDP నిష్పత్తి 60% దాటాయని జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది నిలకడలేని పరిస్థితి. భవిష్యత్తుకు మంచిది కాదు” అని హెచ్చరించారు. పెట్టుబడులు ఆకర్షించడంలో చూపిన పట్టుదలను ఆర్థిక నిర్వహణలో, వనరుల వివేకవంతమైన వాడ్కలో కూడా ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రగతికి ముందడుగుగా నిలుస్తుందని, కానీ ఆర్థిక క్రమశిక్షణ మరింత ముఖ్యమని జేపీ గుర్తు చేశారు.


