శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో(Kadiri Municipality) వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఛైర్పర్సన్ నజీమున్నీసా, వైస్ ఛైర్మన్లు గంగాదేవి, రాజశేఖర్ రెడ్డిలపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ పరిణామంతో కదిరి మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి చేరింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా.. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్కు 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. సభ్యులందరూ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.
కాగా వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. గత కొంతకాలంగా ఛైర్పర్సన్ నజీమున్నీసాపై సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ మద్దతుతో కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. తీర్మానం నెగ్గడంతో కూటమి శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి.