Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: పేదల ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

Kalluru: పేదల ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

వైయస్ఆర్ సిపి ప్రభుత్వం పేదలకు ఖరీదైన ఇంటి స్థలాలను ఇస్తుంటే ఓర్వలేక వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబుపై వైయస్ఆర్ సిపి కర్నూలు అధ్యక్షుడు, నగర మేయర్ బి.వై. రామయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇచ్చిన స్థలాలను సమాధులతో పోల్చిన చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కల్లూరు అర్బన్ చెక్ పోస్ట్, సి.క్యాంపు సెంటర్, బిర్లా కాంపౌండ్, కృష్ణనగర్, చెన్నమ్మ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బి.వై. రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు తన 14 ఏళ్ళ పాలనలో ఎన్నడైనా పేదలకు సెంటు స్థలం కూడా ఇచ్చినా దాఖలాలు లేవని, ఆయన ఇప్పుడు పేదల స్థలాల గురించి మాట్లాడటమే కాకుండా సమాధులతో పోల్చటం విడ్డూరంగా ఉందన్నారు. సెంటూ స్థలం సమాధికి అయితే మరీ అంతకన్నా తక్కువ స్థలంలో చంద్రబాబు నిర్మించిన టిడ్కో ఇళ్ళను ఏమనాలని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు ఆయన కండకావరం, దురహంకారానికి నిదర్శనమన్నారు. పేదల ఇళ్లను సమాధులతో పోల్చిన చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీసి రాజకీయంగా సమాధి కట్టాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు కట్టుకుంటున్న ఇళ్లు చంద్రబాబుకు సమాధుల్లా కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఎక్కడ, ఎంతమందికి స్థలాలు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అమరావతి ఇళ్ల పట్టాల ద్వారా చంద్రబాబు ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. అట్టడుగు వర్గాలకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును వర్గ శత్రువుగా భావించి రాజకీయంగా సమాధి కట్టాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో వైయస్ఆర్ సిపి మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ గాజుల శ్వేతా రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు వైజ అరుణ, సాన శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, లక్ష్మికాంత రెడ్డి, నారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నర్సింహులు, వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వైయస్ఆర్ సిపి నాయకులు ఎన్.గోపాల్ రెడ్డి, అక్కిమి హనుమంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శివరాం, బాల చంద్రరెడ్డి, రమణ రెడ్డి, ఆనంద్, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News