Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: వాలంటీర్లే వారధులు, బెస్ట్ వాలంటీర్లకు అవార్డ్స్

Kurnool: వాలంటీర్లే వారధులు, బెస్ట్ వాలంటీర్లకు అవార్డ్స్

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహంతో పాటు సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా మిత్రలతో జిల్లా వ్యాప్తంగా 9,161 మందిని ఎంపిక చేసినట్టు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను మూడు విభాగాల్లో ఎంపిక చేయడంతో పాటు నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమాన్ని విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు..ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డా.మధుసూధన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసన సభ్యులు డా.జె.సుధాకర్, నగర మేయర్ బివై.రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, స్థానిక వార్డు కార్పొరేటర్లు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ, వారు చేసిన ఉత్తమ సేవలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలను సేవా మిత్ర, సేవారత్న, సేవావజ్ర లాంటి మూడు విభాగాలుగా విభజించారన్నారు.

- Advertisement -

సేవా మిత్రలకు 10వేల నగదుతో పాటు సర్టిఫికేట్, శాలువ, బ్యాడ్జ్, సేవా రత్న లకు 20వేల నగదుతో పాటు సర్టిఫికేట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్, సేవా వజ్ర లకు 30వేల నగదుతో పాటు సర్టిఫికేట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ వారి పని తీరు ఆధారంగా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాల్లో భాగంగా ముఖ్యంగా పెన్షన్ అంటే వాలంటీర్ గుర్తొచ్చే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అదే విధంగా సచివాలయ వ్యవస్థకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు హక్కుగా ప్రజల వద్దకు తీసుకెళ్లి వీరు అర్హులా కాదా అని గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా ఒక వారధిలా వాలంటీర్లు ఒక ప్రత్యేక భూమికను పోషిస్తున్నారన్నారు. ఇదే రకమైన సేవా స్ఫూర్తితో ఇంకా మున్ముందు పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేయాలన్నారు. విద్య, వైద్యం, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి వాలంటీర్లు అడిగే పరిస్థితి ఉందన్నారు. వివిధ విభాగాల్లో ఎంపికైన వాలంటీర్లు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వాలంటీర్లు ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించారన్నారు. వాలంటీర్ అంటే స్వచంద సేవకుడని అర్థం అని ముఖ్యమంత్రి మీరు ఉండే గ్రామంలోనే ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు ..వాలంటరీల సేవలు అమోఘం అని, కరోనా సమయంలో ప్రాణాలకు లెక్క చేయకుండ ప్రజలకు సేవలు అందించారన్నారు..,ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు..సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకు సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా.మధుసూధన్ మాట్లాడుతూ వాలంటీర్ వందనం కార్యక్రమం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఎంతో పటిష్ఠంగా ఉందన్నారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేసే వ్యక్తులు మీరు అంతే కాకుండా సంక్షేమ పథకాలు అన్ని వారి అర్హతలను పరిశీలించి వారికి సంక్షేమ ఫలాలు అందజేయడం జరిగిందన్నారు. అదే విధంగా కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ సేవలు అందించి వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని వారికి అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా గడప గడప కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు మేము అందుబాటులో లేకున్నా మీరు వారికి అందుబాటులో ఉండి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిస్తూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల ఫలాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రజలు వారి ఇళ్లలోని శుభకార్యాలకు ప్రజాప్రతినిధులను పిలవకపోయినా వాలంటీర్లను మాత్రం తప్పక పిలిచే విధంగా వారు సేవలు అందించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లను కూడా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని, అందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో దాదాపు ముగ్గురు వాలంటీర్లు సర్పంచులుగా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఇదే విధంగా అందరూ ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.

నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగన సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను అందుబాటు లోకి తెచిందన్నరు మన గౌరవ ముఖ్యమంత్రి పాదయాత్రలో మహిళల,వృద్దుల,వికలాంగుల కష్టాలను చూసి వారికి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ మెరుగైన సేవలు అందించే లా చేశారు సచివాలయం ద్వారా కుల ధృవీకరణ, డేట్ అఫ్ బర్త్ తదితర సర్టిఫికెట్స్ సులభతరంగా అందేలా చర్యలు తీసుకున్నారు, వాలంటీర్ లను ప్రోత్సహించడం కొరకే వాలంటీర్లకు వందనమనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు 230 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ మేయర్ రేణుక సిద్ధారెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల సేవలు అమోహమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమం లో భాగంగా వాలంటీర్ల ద్వారానే నిరుపేదల ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు బాగా చేరుతున్నాయన్నారు. నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ అన్నది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు చేరుస్తున్నారన్నారు. ఇలాంటి వాలంటీర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని చేపట్టారని వాలంటరీలు అందరూ కూడా బాధ్యతతో విధులు నిర్వహించి వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగైన సేవా పథకాలను పొందాలని ఆయన అన్నారు. నియోజకవర్గాల వారీగా పురస్కారాలు వివరాలు.

కర్నూలు నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 6 మంది, సేవా రత్న క్రింద 19 మంది, సేవా మిత్ర క్రింద 1941 మంది ఎంపికయ్యారు. పాణ్యం నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 2 మంది, సేవా రత్న క్రింద 10 మంది, సేవా మిత్ర క్రింద 452 మంది ఎంపికయ్యారు. పత్తికొండ నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 5 మంది, సేవా రత్న క్రింద 25 మంది, సేవా మిత్ర క్రింద 1094 మంది ఎంపికయ్యారు. కోడుమూరు నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 5 మంది, సేవా రత్న క్రింద 25 మంది, సేవా మిత్ర క్రింద 1065 మంది ఎంపికయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 5 మంది, సేవా రత్న క్రింద 20 మంది, సేవా మిత్ర క్రింద 1281 మంది ఎంపికయ్యారు. మంత్రాలయం నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 5 మంది, సేవా రత్న క్రింద 20 మంది, సేవా మిత్ర క్రింద 968 మంది ఎంపికయ్యారు. ఆదోని నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 5 మంది, సేవా రత్న క్రింద 11 మంది, సేవా మిత్ర క్రింద 1001 మంది ఎంపికయ్యారు. ఆలూరు నియోజకవర్గంలో సేవా వజ్ర క్రింద 5 మంది, సేవా రత్న క్రింద 30 మంది, సేవా మిత్ర క్రింద 1161 మంది ఎంపికయ్యారు. జిల్లా వ్యాప్తంగా సేవా వజ్ర క్రింద – 38 మంది, సేవా రత్న క్రింద – 160 మంది, సేవా మిత్ర క్రింద – 8963 మంది ఎంపిక అయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు వాలంటీర్లకు వందనం కార్యక్రమం ద్వారా 9161 మంది వాలంటీర్లకు మొత్తం రూ.9.39 కోట్ల రూపాయల మెగా చెక్కును అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News