Kakani Govardhan Reddy: తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ సాగుతున్న రాజకీయ రగడపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ తిప్పికొడుతుంటే, తట్టుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాలో తన గళాన్ని విప్పారు.
సీబీఐ రిపోర్ట్తో నిజం తేలిపోయింది!
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కాకాణి పేర్కొన్నారు. “సీబీఐ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని స్పష్టమైంది. చంద్రబాబు చెప్పేవన్నీ కట్టుకథలేనని శాస్త్రీయంగా తేటతెల్లమైంది” అని ఆయన ఉద్ఘాటించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు.
Also Read: YSRCP – ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే!
భక్తుల మనోభావాలతో ఆటలా?
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇందుకు బాధ్యత వహిస్తూ ఆయన భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. అలాగే, చంద్రబాబు ఆశించినట్లుగా రిపోర్ట్ రాలేదన్న కోపంతో, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బలిపశువును చేయడం దారుణమని ఆక్షేపించారు.
హత్యాయత్న రాజకీయాలా?
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ.. “మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేస్తారా?” అని కాకాణి నిలదీశారు. వాస్తవాలను బయటపెడుతుంటే దాడులకు తెగబడటం పిరికిపంద చర్యని, ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడబోవని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

