Payyavula Slams Jagan: మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు విజయసాయిరెడ్డి హాజరుకావడం జగన్ క్యాంపులో వణుకు పుట్టిస్తోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. విచారణలో విజయసాయిరెడ్డి ఏయే నిజాలు చెప్పారో, ఎవరి పేర్లు బయటపెట్టారో అన్న ఆందోళనతో జగన్ ప్రశాంతత కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ నెపాన్ని ప్రభుత్వంపైకి నెట్టేందుకే జగన్ కొత్త నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు.
“సొంత బాబాయిని చంపిన వారిని పక్కన పెట్టుకున్న జగన్కు విలువలు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు పయ్యావుల. క్రెడిబిలిటీ లేని వ్యక్తి ‘క్రెడిట్ చోరీ’ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అనిదుయ్యబట్టారు.భూములపై జగన్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకోవడానికి జగన్ ప్లాన్ చేశారని, కానీ కూటమి ప్రభుత్వం రీ-సర్వే ద్వారా ప్రజల భూములకు రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేశారు. “ప్రజల పట్టా పుస్తకాలపై రూ.700 కోట్లు ఖర్చు చేసి నీ బొమ్మ వేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు?” అని జగన్ను నిలదీశారు.
Also Read: Vijayasai Reddy – జగన్ కోటరీపై విజయసాయిరెడ్డి నిప్పులు
రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా దానికి రాజకీయ రంగు పులుముతూ, కులాలు మరియు మతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం జగన్ నైజమని విమర్శించారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ,భూకబ్జాల వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణను వేగవంతం చేసింది. ముఖ్యంగా లిక్కర్ పాలసీలో జరిగిన వేల కోట్ల అవకతవకలపై కేంద్ర సంస్థల నిఘా పెరగడంతో, వైసీపీ అగ్రనేతల్లో ఆందోళన మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పయ్యావుల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

