Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Mithun Reddy liquor scam custody : లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి కస్టడీ.....

Mithun Reddy liquor scam custody : లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి కస్టడీ.. విజయవాడకు తరలింపు

Mithun Reddy liquor scam custody : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్త సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. వైసీపీ రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన్ను ఈ ఉదయం విజయవాడకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో నేడు రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ నిర్వహిస్తారు.

- Advertisement -

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) జరిగిన ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చిన సిట్, జులై 19న ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆగస్టు 1 వరకు జుడిషియల్ కస్టడీలో రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ మంజూరై, 11న సరెండర్ చేసుకున్నారు. దీని తర్వాత సిట్ మరింత లోతైన దర్యాప్తుకు ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం విచారణలో కోర్టు రెండు రోజులకు మాత్రమే అనుమతించింది. మిథున్ రెడ్డి ముందుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కానీ అది తిరస్కరించబడింది.

ALSO READ : AP Private degree colleges Strike : ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఫీజు బాకాయిలతో బంద్ ప్రకటన

సిట్ ప్రకారం, ఈ కేసులో రూ. 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. మిథున్ రెడ్డి పాలసీ మార్పులు, కిక్‌బ్యాకులు, మనీ లాండరింగ్‌లో కీలక పాత్ర పోషించారని ఆరోపణ. ఆయన కాల్ డేటా రికార్డులు, లొకేషన్ విశ్లేషణలు హైదరాబాద్, విజయవాడ, తాడేపల్లిలో నిందితులతో సమావేశాలు నిర్దారించాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (ఏ1) వంటి మాజీ ఐటీ సలహాదారులు, సజ్జల శ్రీధర్ రెడ్డి (ఏ6)లతో ముడిపడి ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 మంది అరెస్టులు, రూ. 62 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. 268 మంది సాక్షుల విచారణలు, 100కి పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు ఆధారాలుగా 300 పేజీల చార్జ్‌షీట్ దాఖలైంది.

మరోవైపు, ఈ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా చురుకుగా ఉంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, ఆర్థిక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి నుంచి పట్టించుకున్న ఆస్తులు, నగదు వివరాలపై సిట్‌తో సమన్వయం చేస్తున్నారు. ఈ పరిణామాలతో దర్యాప్తు మరింత వేగవంతమైంది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో 50 రోజులు గడిపారు, పార్టీ నేతలు ఆయన్ను సందర్శించి మద్దతు తెలపడం కొనసాగుతోంది.

వైసీపీ నేతలు ఈ అరెస్టులను ‘రాజకీయ పక్షపాతం’గా ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులపై లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే, మంత్రి వంగలపూడి అనిత మిథున్ అరెస్టు ‘కాంక్రీట్ ఎవిడెన్స్’ ఆధారంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సిట్ విచారణలు మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం అవినీతి దర్యాప్తుల్లో పారదర్శకత కాపాడుకుంటూ, విచారణలు పూర్తి చేయాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad