Meat Shops Closed:విశాఖపట్నం నగర ప్రజలకు జీవీఎంసీ కీలక సమాచారం వెల్లడించింది. ఫిబ్రవరి 15 ఆదివారం జరగనున్న మహా శివరాత్రి సందర్భంగా నగర పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారికంగా ప్రకటించారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న మాంసం, చికెన్, చేపలు, రొయ్యలు విక్రయించే దుకాణాలు అలాగే జంతు వధశాలలు ఆ రోజంతా పనిచేయవని తెలిపారు.
మరికొన్ని జాతీయ సెలవులు…
మహా శివరాత్రి రోజున ఎవరూ షాపులు తెరవకూడదని స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘించి దుకాణాలు ప్రారంభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ఒక్క మహా శివరాత్రికే పరిమితం కాదని, 2026 సంవత్సరంలో మరికొన్ని జాతీయ సెలవులు, పర్వదినాల్లో కూడా ఇదే నిబంధనలు అమలులో ఉంటాయని కమిషనర్ తెలిపారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/ap-budget-2026-27-big-boost-for-women-with-1500-aid/
పది రోజుల పాటు నగరంలో..
జీవీఎంసీ ప్రకటించిన తేదీల ప్రకారం 2026లో మొత్తం పది రోజుల పాటు నగరంలో వేటమాంసం, కోడి మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు నిలిపివేయాలి. వాటిలో మహా శివరాత్రి 15 ఫిబ్రవరి 2026 ఆదివారం, శ్రీరామ నవమి 27 మార్చి 2026 శుక్రవారం, మహావీర్ జయంతి 31 మార్చి 2026 మంగళవారం, మేడే 1 మే 2026 శుక్రవారం, బుద్ధ జయంతి 1 మే 2026 శుక్రవారం, స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు 2026 శనివారం, శ్రీ కృష్ణాష్టమి 4 సెప్టెంబర్ 2026 శుక్రవారం, గాంధీ జయంతి 2 అక్టోబర్ 2026 శుక్రవారం, ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం 1 నవంబర్ 2026 ఆదివారం, సాదు టి ఎల్ వాశ్వాని జయంతి 25 నవంబర్ 2026 బుధవారం ఉన్నాయి.
స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని..
సంబంధిత వ్యాపారులు ఈ తేదీలను గమనించి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ సూచించింది. జంతు వధశాలలు కూడా ఆయా రోజుల్లో పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. ప్రజలు కూడా ఈ నిర్ణయానికి సహకరించాలని కమిషనర్ కోరారు.
ప్రత్యేకంగా ఆదివారం రోజున పర్వదినం రావడంతో మాంసాహారాన్ని ఇష్టపడే వారికి కొంత ఇబ్బంది కలగొచ్చని తెలుస్తోంది. అయినప్పటికీ నగర పాలక సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని పాటించడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు.

