Minister Nara Lokesh Comments on Jagan: ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి కల్పన మా బ్రాండు.. గొడ్డలి జగన్ బ్రాండు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కడప జిల్లా టి.కోడూరులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్తో కలిసి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొట్టిపాటి కృషి చేస్తున్నారని కొనియాడారు.
Also Read: BRS: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు- హరీశ్ రావు
రాష్ట్రం చూపు జమ్మలమడుగు వైపు..
‘‘11 నెలల్లో ప్రాజెక్టు సాధించడం వెనుక ఇక్కడి రైతుల త్యాగం ఎంతో ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి కల్పన చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యం. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లను నిర్మిస్తున్నాం. తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్ విమానాల తయారీ కంపెనీలు వస్తున్నాయి. గత వైసీపీ హయాంలో జగన్ కంపెనీలను తరిమేశాడు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంతో ఏపీలో పరిశ్రమల స్థాపనకు సంస్థలు ముందుకు రావడం లేదు. మీరు ఎలాంటి భరోసా ఇస్తారని కంపెనీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తామని ఆయా కంపెనీలకు స్పష్టమైన హామీ ఇచ్చాం. దీంతో, పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. విధ్వంసం చేయడం ఒక్క నిమిషంలో పని, కానీ నిర్మించడం ఎంతో కష్టం’’ అని లోకేశ్ పేర్కొన్నారు.

