జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు మాజీ సీఎం జగన్లా పార్టీ రంగులు, పేర్లు పెట్టుకోవాలనే యావ తమకు లేదని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలకు గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా జగన్ పెట్టుకున్నారని విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
“జగన్ గారూ మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరువ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల,మత అంతరాలు పాటించకుండా…తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళామణులు వేలాదిమందికి స్త్రీశక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్, మెటీరియల్ అందజేశాను. మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022,జూన్20 ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్పటివరకూ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్షణ పూర్తిచేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశాం.
తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023, ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచుల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశక్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసి, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశాం. ఇవన్నీ నా జేబులోంచి తీసిన డబ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే…శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాలనే యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం” అని పేర్కొన్నారు.