Free Electricity: రాష్ట్రంలో నేతన్నలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని.. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత శాసనమండలిలో వెల్లడించారు.
చేనేత వృత్తిలో ఉన్న వారందరినీ అర్హులుగా ప్రకటిస్తూ వారికి ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని శాసనమండలిలో శుక్రవారం ప్రకటించారు.
మగ్గం నేతన్నలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను వినియోగించుకోవచ్చు. మర మగ్గం నేతన్నలు ప్రతి నెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నివేదికల ప్రకారం రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలు ఉండగా.. 10,534 మర మగ్గాల కుటుంబాలు ఉన్నాయి.
Also Read: https://teluguprabha.net/national-news/pm-rahat-scheme-launched-rs-1-5-lakhs-cashless-treatment/
ఉచిత విద్యుత్ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి సుమారు రూ. 8,640, మర మగ్గాల యజమానులకు రూ. 21,600 వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 85 కోట్ల అదనపు భారం పడనున్నట్లు పేర్కొన్నారు.

