Kakinada Fire Accident: కాకినాడ జిల్లా వేట్లపాలెం పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వేట్లపాలెం అగ్నిప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయినవారిని కోల్పోవడంతో మృతదేహాల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ప్రమాద సమయంలో కొందరు భోజనానికి వెళ్లడంతో వారు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనపై పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు విచారం వ్యక్తం
పేలుడు ఘటనపై మంత్రులు నారా లోకేశ్, అనిత, నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలానికి వైద్యులను పంపించి తక్షణం సాయం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సమగ్ర విచారణ జరపాలి
బాణసంచా తయారీ కేంద్రంలో కార్మికుల మృతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదరకరమని.. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-annual-budget-rs-5456-trustees-approved/
అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని స్పష్టం చేశారు.

