weather Forecast Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అది తదుపరి రెండు రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 21న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నట్టు పేర్కొన్నారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


