నందవరం మండల పరిధిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణా ఏర్పాట్లను ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు పరిశీలించారు.

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శనానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ భద్రత ఏర్పాట్లు చేయడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని దేవాదాయ శాఖ అధికారులకు, స్థానిక నందవరం మండల పోలీసు అధికారి శ్రీనివాసులను వారు ఆదేశించారు. అనంతరం నదీ పరివాహక ప్రాంతాన్ని, దేవాలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లపై ఉత్సవ నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు గ్రామీణ సిఐ మధుసూదన్ రావు, నందవరం ఎస్సై శ్రీనివాసులు వారి సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.