Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: 23న 'జగనన్న సురక్ష' యాప్ ప్రారంభం

Nandyala: 23న ‘జగనన్న సురక్ష’ యాప్ ప్రారంభం

ఈ నెల 24 నుండి వాలంటీర్ లు ఇంటింటికి వెళ్లి, పథకాలపై పౌరులతో చర్చించాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 23న “జగనన్న సురక్ష” యాప్ ను ప్రారంభించనున్నారని… ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లాధికారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఈ నెల 23న “జగనన్న సురక్ష” యాప్ ను ప్రారంభించిన అనంతరం ఈ నెల 24 నుండి వాలంటీర్ లు ఇంటింటికి వెళ్లి… అమలవుతున్న పథకాలకు సంబంధించి పౌరులతో చర్చించి సమస్యలను గుర్తించి వాటిని నమోదు చేసుకొని, సదరు వివరాలను సంబంధిత డిజిటల్ అసిస్టెంట్లకు ఇవ్వాలన్నారు. ఇందుకు సంబంధించి నంద్యాల నియోజకవర్గానికి డిఆర్డిఎ పిడిని, డోన్ కు ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ, నందికొట్కూరుకు భూగర్భ జల శాఖ డిడి, బనగానపల్లెకు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్, ఆళ్లగడ్డకు నంద్యాల ఆర్డీవో, ఆత్మకూరుకు పట్టు పరిశ్రమ శాఖ డిడి, పాణ్యం నియోజకవర్గానికి మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ లు నోడల్ అధికారులు వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నాణ్యతతో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సమస్యను పారదర్శకంగా అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు*
1)నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామ వాస్తవ్యులు మల్లీశ్వరి, లక్ష్మీదేవిలు అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ భూమిని వేలం పేపర్ ప్రకటన ద్వారా 343/1 సర్వే నంబర్ లో 6 ఎకరాల 18 సెంట్ల పొలాలను మల్లీశ్వరి, లక్ష్మీదేవిలు 3 ఎకరాల 9 సెంట్ల చొప్పున కొనుగోలు చేశామని సదరు భూములను తమ పేర్ల మీద రెవెన్యూ రికార్డులలో నమోదు చేయవలసిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.*

- Advertisement -

2)నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కాపురస్తురాలు డీ.విజయ కుమారి భర్త లేట్ దొరస్వామి 2022లో అనారోగ్యంతో చనిపోయారని…తన భర్తకు సిరివెళ్ల మండలం కొమ్మినేనిపల్లె గ్రామంలో 5.40 ఎకరాల పొలం, పక్కా ఇళ్లు, గోవిందపల్లె మెట్ట గ్రామ సమీపాన 10 సెంట్ల ఇంటి స్థలం ఇతరత్రా ఉన్నాయని…. న్యాయ పరంగా నాకు రావాల్సిన నా భర్త ఆస్తిని నా భర్త కుటుంబ సభ్యులు నాకు ఇవ్వకుండా నన్ను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారని… అలాగే మా పొలం సాగుచేస్తున్న వ్యక్తి సైతం గుత్త ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని… నా సమస్య ను పరిష్కరించి నా భర్త ఆస్తిని నా పేరు మీదకు వచ్చేలా చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.*

3)బండి ఆత్మకూరు మండల వాస్తవ్యుడు బి.మహమ్మద్ అలీకి గ్రామంలోని శ్రీ జనార్దన స్వామి గుడి ఎదురుగా రేకుల గది వున్నదని…. సచివాలయం-1 నూతన భవనం నిర్మాణం కోసం నాయొక్క రేకుల గది ఉత్తర భాగాన ఉన్న గోడ పారను తొలగించారని… ఇందుకు సంబంధించి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని… దయతో నాకు నష్ట పరిహారం చెల్లిచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో 244 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లాస్థాయి ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News