Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు: విడదల రజిని

Nandyala: రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు: విడదల రజిని

నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఆస్పత్రి వైద్యాధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని సర్వజన వైద్యశాలలోని వార్డులను కలియతిరిగి రోగులను ఆత్మీయంగా బాగున్నారా అని పలకరిస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎపీఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓపి విభాగం మొదలుకొని అన్ని వార్డులు కలియతిరిగి రోగులను ఆత్మీయంగా పలకరిస్తూ అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన ఆధునిక వైద్య చికిత్సలు అందించి అవసరమైన మందును పంపిణీ చేయాలని వైద్యాధికారులను మంత్రి సూచించారు. ఆసుపత్రిలోని ఓపి బ్లాక్, ఎంసిహెచ్, ఎన్ఐసియు, ఆపరేషన్ థియేటర్లను, అత్యవసర చికిత్స విభాగాలను సందర్శించారు. అలాగే అక్కడే వున్న రోగులతో మాట్లాడుతూ ఇక్కడ సేవలు ఎలా వున్నాయని అడిగి తెలుసుకున్నారు. మందులు సకాలంలో అందిస్తున్నారా లేదా అని గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు బాగా అందుతున్నాయని రోగులు మంత్రికి నివేదించారు. అనంతరం టెలిమెడిసిన్ విభాగాన్ని సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. టెలిమెడిసిన్ కు సంబంధించి జిల్లాలోని ఎక్కడి నుండైనా ఆరోగ్య సిబ్బంది సర్వజన వైద్యశాలలోని స్పెషలిస్ట్ వైద్య సలహాలు తీసుకొని చికిత్స సేవలు పొందవచ్చని మంత్రికి వివరించారు. ఆస్పత్రి పర్యవేక్షకులు వరప్రసాద్, డిప్యూటీ సూపర్డెంట్ మహబూబాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, నర్సింగ్ పర్యవేక్షకులు నాగరాణి, గైనకాలజిస్ట్ స్నిగ్ధ తదితరులు సంబదిత వార్డుల వివరాలను నివేదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News