ఏపీలో ప్రశ్నాపత్రం లీక్(Paper Leak) కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University) పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన కాలేజీ యాజమాన్యం ఈ ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అంశంపై విచారణ నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందుకు గల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.