Nara Lokesh clarified Thalliki Vandanam scheme implementaion: ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ పథకంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ వినియోగం (300 యూనిట్లు), ఉద్యోగ నిబంధనలు, భూమి కలిగి ఉన్నవారికి సంబంధించిన నిబంధనలు వైసీపీ హయాంలోనే పెట్టారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు.
ఒక్కో సభ్యుడు ఒక్కో సంఖ్య చెప్పడం సరికాదు: ఏపీలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ, విద్య, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యార్థుల నుంచి తగ్గించిన రూ.2 వేలను వినియోగిస్తున్నామని అన్నారు. వైసీపీ సభ్యులు అమ్మఒడి అని మాట్లాడుతున్నారు కానీ అది అమ్మఒడి కాదు.. తల్లికి వందనం అని లోకేష్ అన్నారు. ఎంతమంది విద్యార్థులు తల్లికి వందనం కింద లబ్ధిపొందారో ముందు వైసీపీ సభ్యులు స్పష్టత తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. ఒక్కో సభ్యుడు ఒక్కో సంఖ్య చెప్పడం సరికాదని అన్నారు. తల్లికి వందనం అమలు ప్రక్రియలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని కోరారు.
Also Read:
కేబినెట్లో చర్చించాక నిర్ణయం: అర్హులందరికీ తల్లికి వందనం అందజేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు . ఎస్సీ విద్యార్థులకు కేంద్రం కూడా నగదు అందజేస్తోందని తెలిపారు. రెండింటిని జోడించి నగదు జమచేస్తామని అన్నారు. ఇందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. వైసీపీ హయాంలో ఏడాదికి రూ.13వేలు ఇచ్చారని అన్నారు. అది కూడా చివరి ఏడాదిలో రూ.500 తగ్గించిన అంశాన్ని లోకేష్ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఇచ్చింది నాలుగేళ్లు మాత్రమేనని అన్నారు. అర్హులందరికీ తల్లికి వందనం కింద ప్రతి ఏడాది సాయం అందించేందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ రేషన్ కార్డులు మంజూరు చేశామని అన్నారు. ఆశావర్కర్లు, అంగన్ వాడీలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కేబినెట్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే మినహాయింపు ఇచ్చిన అంశాన్ని మంత్రి లోకేష్ శాసనమండలిలో గుర్తు చేశారు.


