ప్రభుత్వం శాశ్వతమని, రాజకీయాలు ఎన్నికలు పూర్తయ్యేవరకేనని మాజీ సీఎం జగన్(YS Jagan) ఇప్పటికైనా తెలుసుకోవాలని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) హితవు పలికారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించడం సంప్రదాయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గతంలో జగన్ విధ్వంస పాలనతో బ్రేక్ చేశారని విమర్శించారు. ఇది ఆయన నిరంకుశ మనస్తత్వాన్ని చాటి చెప్పిందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను చెల్లించలేదని.. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేశారని లోకేశ్ ఆరోపించారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేశామని గుర్తుచేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే బాధ్యతగా తీసుకున్నామని లోకేశ్ వెల్లడించారు.