అమరావతి పునఃనిర్మాణ సభలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హాట్ కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు తన సంతాపం తెలియజేశారు. ఒక్క పాకిస్థాన్ కాదు.. వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరని తెలిపారు. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. ఆ మిసైల్ పేరు నమో అని తెలిపారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయమన్నారు. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరన్నారు. యావత్ దేశం నమో వెంట నిలుస్తోందన్నారు. కులగణన చేయడానికి చాలా మంది నేతలు దశాబ్దాలుగా వెనుకాడుతుంటే నమో మాత్రం ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం అన్నారు. ఢిల్లీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన అమరావతి కోసం వచ్చారని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్ట్లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కనబెట్టారని విమర్శించారు. ఆపేదానికి.. పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదని.. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని లోకేష్ అన్నారు.