Lokesh Satirical Comments on Jagan: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తల్లికి వందనం’ పథకం అమలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నారు. దీంతో తమకు డబ్బులు వచ్చాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమల్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. నంద్యాల జిల్లాలో చాలా మంది విద్యార్థులకు ఒకే తల్లి పేరు నమోదైంది. ప్యాపిలిలో 96 మంది విద్యార్థులకు ఒకటే తల్లి పేరు కనిపిస్తోంది. ఈ తప్పదాన్ని సరిచేసే పనిలో అధికారులు ఉన్నారు.
ఈ క్రమంలో ఈ పథకం అమలలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఒకే తల్లి పేరు మీద 340 పిల్లల పేర్లు నమోదు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఒకే తల్లి పేరుతో 10 నుంచి 30 మంది వరకూ విద్యార్థుల పేర్లు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. వీరంతా టీడీపీ కార్యకర్తలేనంటూ పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ పోస్టులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అర్హులకు సంబంధించిన నగదును ఇప్పటికే వారి తల్లులకు విడుదల చేశామని పేర్కొంది. అనర్హత పొందిన లబ్దిదారుల వివరాలు గ్రామ సచివాలయ శాఖ వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే తెలియజేశామని తెలిపింది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు కలిగిన తల్లుల జాబితా పున:పరిశీలించాక వారికి కూడా నగదు జమ చేయడం జరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపిందని ట్వీట్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ పథకంపై వస్తున్న ఫేక్ ప్రచారాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ పథకం అమలు తీరుపై వైసీపీ అధినేత జగన్ రెడ్డి తన పత్రిక ద్వారా మరోసారి అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని.. తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందన్నారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయన్నారు. జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తమది ప్రజా ప్రభుత్వం అని.. తప్పు చెయ్యం..చెయ్యనివ్వమని పేర్కొన్నారు. జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉన్నట్టుందని.. ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్దని ఎద్దేవా చేశారు.
Nara Lokesh: జగన్కు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను.. మంత్రి లోకేశ్ సెటైర్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES