Nara Lokesh Thanks to CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పరిపాలన చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోకుండా సామరస్యంగా విభజన సమయం నాటి విభేదాలను పరిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కొలువై ఉన్న ఎన్టీఆర్ ఘాటు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మృతివనమైన ఎన్టీఆర్ ఘాట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) ఆధ్వర్యంలో రూ.1.35 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం, తెలుగు జాతి వెలుగు సంతకం ఎన్టీఆర్ స్మృతివనం అయినటు వంటి ఎన్టీఆర్ ఘాట్కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషమన్నారు. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లోకేశ్ ట్వీట్ ను కాంగ్రెస్ శ్రేణులు కూడా స్వాగతిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
కాగా ఎన్టీఆర్ మరణానంతరం ఆయన గుర్తుగా ట్యాంక్ బండ్ వద్ద అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ ఘాటు నిర్మించింది. 1999లో ఈ ఘాట్ ను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఘాట్ కు ప్రాముఖ్యత ఏర్పడింది. ఆయన జయంతి, వర్థంతి రోజుల్లో కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవల నిర్వహణ సరిగా లేక ఎన్టీఆర్ ఘాట్ పెచ్చులు ఊడిపోతూ శిధిలావస్థకు చేరుకుంది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘాట్ మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాట్ మరమ్మతులకు నిధులు కేటాయించారు.
Nara Lokesh: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రి లోకేశ్ ధన్యవాదాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES