CM Chandrababu and Minister Nara Lokesh: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
ఈ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. దేశ ప్రగతి, సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజల నిర్ణయం ఇది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మోదీ దార్శనిక నాయకత్వంలో పారదర్శకమైన, వేగవంతమైన పాలనపై దేశం ఉంచిన విశ్వాసాన్ని ఈ ఫలితాలు పునరుద్ఘాటించాయని వెల్లడించారు. వృద్ధి, అవకాశాలను ఆకాంక్షిస్తున్న ‘నవ భారతం’ ఈ విజయంతో శక్తివంతమైన మద్దతును తెలిపిందని పేర్కొన్నారు.
‘ఈరోజు ఎన్డీఏ సాధించిన విజయం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపైనా, వికసిత భారత్ కోసం ఆయనకున్న దార్శనికతపైనా ప్రజలకు ఉన్న నిరంతర, పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తితో నడిచే ప్రజల ఆకాంక్షల సంగమంగా ఎన్డీఏను ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఫలితంతో వికసిత భారత్ దిశగా సాగే ప్రయాణం మరింత బలోపేతమైంది. అభివృద్ధి పట్ల ఎన్డీఏకున్న అచంచలమైన నిబద్ధతకు ప్రజల విశ్వాసం, మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. యువ భారతదేశం విశ్వసనీయతకు, అభివృద్ధికి, పౌరులతో నిజమైన అనుబంధానికి విలువ ఇస్తుందనే సందేశాన్ని ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందిస్తోంది. గెలుపు దిశగా కృషి చేసిన ఎన్డీఏ నేతలందరికీ ధన్యవాదాలు’- సీఎం చంద్రబాబు
‘అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎన్డీఏకు హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రజా తీర్పు, అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, వేగం, విస్తృతి, సమగ్రతతో కూడిన పాలనపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని ఈ తీర్పు మరింత బలపరుస్తుంది. ఇది అభివృద్ధి, అవకాశాలు, సమ్మిళిత ప్రగతిని ఆకాంక్షించే పురోగమన భారతదేశానికి లభించిన బలమైన ఆమోదం.’- మంత్రి నారా లోకేశ్
మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్కి కూడా మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.

