New pensions for widows from June 12: కొత్త పింఛన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వచ్చే జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 12 నుంచి రాష్ట్రంలోని ప్రతి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కానున్నట్లు కీలక ప్రకటన చేశారు. వితంతువుల కొత్త పింఛన్ల కొరకు త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. త్వరలోనే ఆన్లైన్ విండో ఓపెన్ అవుతుందని, వితంతువులు అందులో కొత్త పింఛన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని, తమ ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోందన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
Also read: Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది

