Kadapa Council Meeting Update: కడప నగరపాలక సంస్థ సమావేశంలో కుర్చీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా మేయర్తో పాటు వైసీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. దీంతో సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో మేయర్ సురేష్ బాబు ఛాంబర్కు అధికారులు నోటీసు అంటించారు. కౌన్సిల్ హాలులో ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అధికారులు హాజరైనా మేయర్తో పాటు కొందరు వైసీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 13న పంపించిన సమాచారం ప్రకారం కౌన్సిల్ హాలులోనే సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయినా కానీ ఇవాళ ఉదయం సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు. సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లేని కారణంగా సర్వసభ్య సమావేశం వాయిదా పడిందని తెలిపారు. అయితే ఈ నోటీసులపై మేయర్ ఇంకా స్పందించలేదు.
అసలు ఏం జరిగిందంటే.. సర్వసభ్య సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాలులో హాలులో మేయర్ సీటు పక్కనే కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రాజగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కూడా అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. దీంతో తనకు తెలియకుండా తన పక్కనే కుర్చీలు ఏర్పాటు చేయడంపై మేయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారు. అయితే నిబంధనల ప్రకారం కౌన్సిల్ హాలులో సమావేశం ఏర్పాటు చేయకుండా మేయర్ ఛాంబర్లో ఎలా ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ప్రశ్నించారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ఆమె కౌన్సిల్ హాలులో వేచి ఉండగా.. మేయర్, వైసీపీ కార్పొరేటర్లు ఛాంబర్లోనే ఉన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది.
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగింది. గతంలో రెండుసార్లు జరిగిన సర్వసభ్య సమావేశంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సమావేశానికి మేయర్ కుర్పీ పక్కనే ఎక్స్ అఫిషియో సభ్యులైన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో తనను అడగకుండా వారికి కుర్చీలు ఎలా ఏర్పాటుచేస్తారని మేయర్ అభ్యంతరం తెలిపారు. కాగా మేయర్ కుటుంబం నిబంధలను విరుద్ధంగా కాంట్రాక్టు పనులు చేపట్టారని మేయర్ సురేశ్ బాబుపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఆధారంగా మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేశ్ బాబుపై అనర్హత వేటు వేశారు. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే.