అసెంబ్లీలో వివిధ ప్రశ్నలకు అధికారులు ఇస్తున్న సమాధానాలపై డిప్యూటీ సీఎం పవన్, మంత్రి డోలా తీవ్ర అభ్యంతరం తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లింపు విషయంలో అధికారులు అందించిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా ‘అవును.. కాదు.. ఉత్పన్నం కాదు’ అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
ఏంటీ ఆన్సర్లు..
పొడిపొడిగానే చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బుధవారం సభలో స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. ఉన్నతాధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా.. పొడిపొడి సమాధానాలు చెప్పడం పట్ల డిప్యూటీ సీఎం అభ్యంతరం తెలిపారు. ఇలాగే సమాధానాలు చెప్పాలని ఏమైనా నిబంధనలున్నాయా? అంటూ అధికారులను ఆయన ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ఉండాలని పవన్ స్పష్టం చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు నిధులు మళ్లింపు అంశంపై అధికారులు చెప్పిన సమాధానం పట్ల మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అసహనం వ్యక్తం చేశారు.
కచ్ఛితమైన సమాధానం చెప్పాలి..
గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని మరోసారి ఉన్నతాధికారులను ఆదేశించారు.