Wednesday, July 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan AP pensions distributed:

Pawan Kalyan AP pensions distributed:

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

- Advertisement -

‘రాష్ట్రాభివృద్ధి… ప్రజా సంక్షేమం కోసం నేను బలమైన సంకల్పంతో ఎన్నికలకు వచ్చాను. ప్రజలంతా జనసేనను వంద శాతం విశ్వసించారు. వందకు వంద స్ట్రయిక్ రేటు ఇవ్వాలని కోరితే, ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇప్పుడు పాలనలోనూ అదే బలమైన సంకల్పాన్ని చేసుకుంటున్నాను. 100 శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలి. ప్రతి గ్రామం గొంతు తడవాలి.. ప్రతి ఇంటికి లోటు లేకుండా నీరు అందాలి. కాలుష్యపు నీరు లేకుండా ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి అన్నదే లక్ష్యమ’ని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మొన్నటి వరకు ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలు అయిపోయాయి. ఇప్పుడు పూర్తిగా పాలనపారమైన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసిందనీ, వాటిని గాడిలోపెట్టేందుకు పూర్తి స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రూ.3 వేల పింఛనును రూ.4 వేలు చేశారు. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు గత మూడు నెలలకు సంబధించిన రూ.3 వేలు కలిపి మొత్తంగా రూ.7 వేలు పింఛను ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలుకి చెందిన దివ్యాంగురాలు శ్రీమతి మేడిశెట్టి నాగమణికి మొదటి పింఛను అందించారు. అనంతరం పింఛనుదారులతో స్వయంగా మాట్లాడి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వేవేల ధన్యవాదాలు. గెలవగానే పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారు. అయితే నియోజకవర్గానికి ఏదైనా మేలు కలిగించే విషయంతోనే వారి ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలనే తలంపుతో ఈ రోజు పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చాను. నాకు సభలు, ఊరేగింపులు ముఖ్యం కాదు. నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా ఉండే పనులు చేసి, వారి మన్ననలు పొందడమే ముఖ్యం. ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పని చేస్తాను. రక్షిత మంచినీరు, ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడిక తీతలు వంటివి చేసి ప్రజలకు దగ్గర కావాలనేది నా ఆకాంక్ష.
• పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశారు..
కీలకమైన పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆ శాఖలో జరిగిన ముఖ్య విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయి. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో, ఎలా దారి మళ్లించారో కూడా అంతుపట్టడం లేదు. లోతుల్లోకి వెళ్లి సమీక్షిస్తుంటే అధికారులు చెబుతున్న విషయాలు విస్తుగొలిపేలా ఉంటున్నాయి. చిన్నచిన్న మరమ్మతులకు, నిర్మాణాలకు వారు పెట్టిన ఖర్చులు దారణంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ లో చక్కగా పని చేసే అధికారులున్నాయి. వారిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలోనే తప్పులు జరిగాయి. వీటిని సరిదిద్దాలి. పంచాయతీరాజ్ లో పునరుత్తేజం నింపాలి. సమగ్రంగా వ్యవస్థకు జీవం పోయాలి.

• నా ఆఫీసుకి కొత్త ఫర్నిచర్ వద్దు… అవసరమైతే నేనే కొనుగోలు చేసుకొంటా
సమీక్షల్లో భాగంగా ఒక్కో శాఖ ఆర్థిక స్థితిని పరిశీలిస్తుంటే అప్పులు పేరుకుపోయి ఉన్నాయి. పంచాయతీరాజ్ లో జరిగిన నిధుల దుర్వినియోగం, మళ్లింపు.. ఆ ఫలితంగా నిధుల లేమిని వాస్తవంగా చూసిన తర్వాత నాకు జీతం వద్దని అధికారులతో చెప్పాను. తొలుత జీతం తీసుకొని పని చేస్తాను అని చెప్పాను. అయితే అప్పులతో మునిగిపోయిన శాఖ బాధ్యతలు చూస్తూ నేను జీతం తీసుకోవడం భావ్యం కాదు అనుకున్నాను. నా క్యాంపు కార్యాలయానికి సైతం అధికారులు చిన్నచిన్న మరమ్మతులు అవసరం అవుతాయనిచెప్పినా, వద్దు అన్నాను. అప్పులు చేసి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. కార్యాలయానికి కొత్త ఫర్నీచర్ కూడా పెట్టొద్దని చెప్పాను. నాకు ఏదైనా అవసరం అయితే నేనే ఫర్నిచర్ కొనుగోలు చేసి తెచ్చుకుంటాను. ప్రభుత్వం నుంచి మాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను. హంగులు, ఆర్భాటాలు కాకుండా నాశనం అయిన వ్యవస్థలను తిరిగి సరిదిద్దాలనే సంకల్పంతోనే పని మొదలుపెట్టాను. దాని కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తాను. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గురించి లోతుగా తెలుసుకుంటున్నాను. తర్వాత దాన్ని ఎలా సరిదిద్దాలనే విషయాలపై ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తాను. దేశంలోనే అత్యుత్తమంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలనేది నా ప్రయత్నం.

• పొల్యూషన్ ఆడిట్ లెక్కలు తీస్తున్నాము
రాజకీయాల్లోకి డబ్బు కోసమో, పదవి కోసమో నేను రాలేదు. ప్రజల కోసం పని చేయాలనే దృఢమైన సంకల్పంతో వచ్చాను. ప్రజలు ఆశీర్వదించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు. నా సొంత డబ్బులను ఖర్చుపెట్టుకొనే రాజకీయాలు చేశాను.. ప్రజలకు సాయం అందించాను. ఇప్పుడు కీలకమైన శాఖలు చూస్తూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేళ ఒకటే చెబుతున్నాను. నా వైపు నుంచి అవినీతికి తావుండదు. దీనికి తగినట్లుగా అధికారులు పని చేయాలి. కీలకమైన పర్యావరణ శాఖను తీసుకున్నాం. దీనికి తగినట్లుగానే రాష్ట్రంలోని ఏ పరిశ్రమల నుంచి ఎంత మేర కాలుష్యం విడుదల అవుతుందనే ఆడిట్ లెక్కలు తీయిస్తున్నాం. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నిర్యంత్రణ చర్యలు అవలంబించేలా చేయాలి. కాలుష్యం తగ్గించేందుకు ఉన్న అవకాశాలు, కాలుష్యరహిత పరిశ్రమలను ప్రోత్సహించేలా పని చేస్తాం.
• రుషికొండ తవ్వేసి రాజమహల్ కట్టారు
అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రూ.600 కోట్లు ఖర్చుపెట్టి రుషికొండను తవ్వేసి మరీ రాజమహల్ కట్టారు. ఇప్పుడు అది ఎందుకు పనికిరాకుండా అయింది. ఖర్చుపెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. గత ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నట్లు విదేశీ అతిథుల కోసం కట్టామని చెబుతున్నారు. వారి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటి..? వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో కట్టిన రాజప్రసాదం డబ్బుతో ఓ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యేది. ఓ జిల్లాకు పెట్టాల్సిన డబ్బు ఓ కోటకు పెట్టారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. వాటిని తవ్వి బయటకు తీస్తుంటే విస్తుపోవడం మొదట మా వంతు అవుతుంటే… తర్వాత ప్రజల వంతు అన్నట్లు ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన విచ్చలవిడి అక్రమాలకు తెరపడాలి. ప్రజలకు అవసరం అయ్యే మార్పులు అన్ని వ్యవస్థల్లో రావాలి.
కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకం నిధులు కావల్సినన్ని ఉన్నాయి. ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వాలనే ఆశయంతో జల్ జీవన్ మిషన్ పథకం ఉంటే, దాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. గోదావరి పక్కనే ఉన్నా తాగునీరు సరిగా లేని చాలా గ్రామాలున్నాయి. కొల్లేరు సరస్సు చెంతనే ఉన్నా మంచి నీరు దొరకని కైకలూరు వంటి ప్రాంతాలున్నాయి. కేంద్ర పథకాన్ని ఉపయోగించుకొని దాహార్తి తీర్చాల్సిన ప్రభుత్వం ఆ నిధులను తెచ్చుకోవడంలో వెనుకబడింది. కేంద్ర పథకాలకు రాష్ట్రం కూడా తగినంత మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలనే నిబంధన ఉంటుంది. ఒక్కో పథకానికి ఒక్కోలా ఆ గ్రాంటు ఉంటుంది. దాన్ని గత ప్రభుత్వం ఇవ్వక వేల కోట్ల రూపాయల నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇస్తే, వేయి కోట్లు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోక కేంద్ర నిధులన్నీ ప్రజలకు అందకుండాపోయాయి. వివిధ కేంద్ర పథకాలకు రావల్సిన నిధులను గత ప్రభుత్వం చాలా వరకు తీసుకోలేకపోయింది.

• జవాబుదారీ పాలన అందిస్తాం
పాలన చేతికొచ్చింది అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పలేను కానీ.. ప్రభుత్వంలో ఏ జరుగుతుందో సామాన్యుడికి అర్ధం అయ్యేలా పాలన ఉంటుంది. పూర్తిగా గాడి తప్పిన వ్యవస్థలకు జీవం పోయాలి. పాలనలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాం. వారికి జవాబుదారీ పాలన అందిస్తాం. మంచినీరు, పారిశుద్ధ్యం లేని గ్రామాలను తీర్చిదిద్దడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. దీనికోసం పిఠాపురంలోనే మొదటి మోడల్ గ్రామాన్ని తీర్చిదిద్దుతాం. భారతదేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని నిలపాలనేదే నా కోరిక. దీనికి పూర్తిస్థాయిలో పనిచేస్తాను. పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం ఎన్.ఆర్.ఐలతోనూ మాట్లాడుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి ఫోకస్ తో పని చేస్తాను.
• వాలంటీర్లు లేకపోతే పనులు కావు అన్నారు
తాము నియమించిన వాలంటీర్లు లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసాధ్యం అని గత ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పారు. అలాంటిది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఈ రోజు వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందిని ఉపయోగించుకొని ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ మొదలుపెట్టాం. సోమవారం సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ అయిపోతుంది. అరకొర మిగిలితే రేపు పూర్తి చేయాలని ఆదేశించాం. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ సమయంలో కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100 తక్కువ కాకుండా తీసుకునేవారనే ఫిర్యాదులు గతంలో నాకు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వారు లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారు. వాలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీనివల్ల చేసి చూపించాం.
• తప్పు చేసిన వారికి శిక్ష పడాలి
నేను, శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుకుంటున్నపుడు రాష్ట్రంలో మొదట వ్యవస్థలను బలోపేతం చేయాలని సమష్టిగా అనుకున్నాం. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో వరుస తనిఖీలు చేస్తున్నపుడు బయటపడుతున్న అక్రమ రేషన్ బియ్యం వైసీపీ మాఫియా ఎంత బలంగా ఉందో చాటిచెబుతోంది. నేను ఎన్నికలప్పుడు కాకినాడ మాఫియా గురించి చెప్పాను. ఇప్పుడు తనిఖీల్లో భాగంగా వేల మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యం బయటపడుతుంటే ప్రజలు కళ్లారా చూస్తున్నారు. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రూ.39లు రాయితీ భరిస్తోంది. ఆ సొమ్ము ప్రజలది. దాన్ని మాఫియా కొల్లగొడుతోంది. ప్రజాధనం ఎంత కొల్లగొట్టిందో శ్రీ మనోహర్ గారి పరిశీలనలో బహిర్గతం అవడం విస్తుగొలిపింది. ఇక కడపలో బైరెటీస్ గనులన్నీ గుల్ల చేసేశారు. అసలు కనివినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు బాధ్యులకు శిక్ష పడాలి. అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. మాది సాధింపుల ప్రభుత్వం కాదు. ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం మాది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలి. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది.
• ప్రతీ రూపాయికీ సమాధానం చెప్పాలి
నేను సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ అకౌంట్లను ఎప్పుడూ క్షుణ్నంగా చూడలేదు. పన్ను ఎంత కట్టాలి..? ఎక్కడ సంతకం పెట్టాలి అని అడిగి ముగించేవాడిని. పాలనలోకి వచ్చాక ప్రజా ఖజానా నుంచి ఎంత మేర ప్రజాధనం వినియోగం అయింది.. పక్కదారి పట్టించారు… దుర్వినియోగం అనే అన్ని అంశాలను అధికారులు చెబుతుంటే గంటలకు గంటలు వాటిని పరిశీలిస్తున్నాను. వింటున్నాను. నాకున్న సందేహాలను మళ్లీ తీర్చాలని అధికారులను అడుగుతున్నాను. అధికారులు కూడా నన్ను వేరుగా అనుకోవద్దు. కచ్చితంగా ప్రజలకు చెందిన ప్రతి రూపాయికి సరైన సమాధానం చెప్పాలనే కాంక్షతోనే నేను ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాను. రోడ్లు వేయాలని చూస్తే నిధులేవీ లేకుండా మొత్తం ఊడ్చేశారు. దీనిపై ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ గర్వించేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. నేను రెండు తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తాను. రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు వెళతాను. రేపటి తరాలకు భరోసానిచ్చేలా బాటలు వేస్తాను’’ అన్నారు.

ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా కలెక్టరు షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, పిఠాపురం నియోజక వర్గం జనసేన సమన్వయకర్త శ్రీమర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం బీజేపీ ఇంఛార్జి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News