ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దీని వల్ల స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.