Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Pensions in AP: జూలై 1వ తేదీ సోమవారం ఉ.6 గం.లకే ఫించన్లు పంపిణీ...

Pensions in AP: జూలై 1వ తేదీ సోమవారం ఉ.6 గం.లకే ఫించన్లు పంపిణీ మొదలవ్వాలి

మొదటి రోజే నూరు శాతం ఫించన్లు పంపిణీ

రాష్ట్రంలో జూలై 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జులై 1వ తేదీన 65 లక్షల 18వేల 496 మంది వివిధ ఫించన్ దారులకు గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింట ఫించన్లు పంపిణీకి సంబంధించి 4 వేల 399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ఫించన్ల పంపిణీకి ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు ఎంపిడిఓ,మున్సిపల్ కమీషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు.

- Advertisement -

ఈప్రభుత్వ మొదటి అత్యంత ప్రతిష్టా త్మకమైన కార్యక్రమం కావున ఫించన్లు పంపిణీలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు లేదా నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లును ఆదేశించారు.జూలై 1వ తేదీన అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో ఉదయం 6గం.లకు మొదటి ఫించన్ పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు.ఫించన్ సొమ్ముతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వ్రాసిన లేఖను కూడా ఫించన్ దారులకు తప్పక అందించాలని సిఎస్ స్పష్టం చేశారు.

జూలై 1వ తేదీన నూరు శాతం ఫించన్లు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసుకుని మొదటి రోజే 95 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు.అలాగే ఫించన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. గత ఏప్రిల్,మే,జూన్ మాసాలకు 11 కేటగిరీలలో ఫించన్ దారులకు పెంచిన ఫించన్ మొత్తం బకాయిలను కూడా కలిపి జూలై నెల ఫించన్ 4వేల రూ.లతో కలిపి పంపిణీ చేయాలని సిఎస్ ఆదేశించారు.

ఫించన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.ఎక్కడైనా ఏ బ్యాంకైనా డబ్బును శనివారం రాత్రికి ఇవ్వలేకుంటే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత ఫించన్ల సొమ్ము మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వాలని బ్యాంకులకు స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించి సంబంధిత లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు(ఎల్డియం)వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు.

ఈసమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఫించన్లు పంపిణీకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా ఫించన్ పధకం నూతన యాప్ ను పంపడం జరిగిందని దానిని అందరు పింఛన్ పంపిణీ అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు.ఫింఛన్ల పంపిణీకి గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు అవసరమైన ఇతర విభాగాల సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని చెప్పారు.

ఈవీడియో సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ యం.శివ ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి.సత్య నారాయణ,వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News