Vetlapalem Fire Blast: వేట్లపాలెం అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. భారీ పేలుడు సంభవించడంతో చాలా మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. కొందరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు స్థానికులను కలచివేస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికుల భయాందోళనకు గురికాగా.. పేలుడు శబ్దాలు 5 కి.మీ వరకు వినిపించాయని స్థానికులు పేర్కొన్నాయి. ఘటనాస్థలిలో బాధితుల ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి.
ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, అనిత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వేట్లపాలెం పేలుడు ఘటన చాలా బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటిస్తూ ‘X’లో పోస్టే చేశారు.
మరోవైపు వేట్లపాలెం ఘటనాస్థలిని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై పర్యవేక్షించిన ఆయన.. బాణసంచా తయారీ పరిశ్రమ గురించి ఆరా తీశారు. ఘటనపై ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సీఎంకు వివరించారు.

