సింహాచలం(Simhachalam) ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంటు గోడ కూలిపోయింది. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.