Private Bus Overturns: అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
మూడు పల్టీలు కొట్టి పొలాల్లోకి: ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా వన్నెదొడ్డి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సుకు ఎదురుగా లారీ వచ్చింది. దీంతో ఆ లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పింది. మూడు పల్టీలు కొట్టి సమీపంలోని పంట పొలాల్లో పడిపోయింది.
క్షతగాత్రులు అనంతపురం ఆస్పత్రికి తరలింపు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి వాహనదారులు స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

