తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన సలహాలు, సూచనలపై ప్రముఖ నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు(Dil Raju) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అలాగే, థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి, ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత.
ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలి. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన పవన్ కళ్యాణ్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతాము. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతాం’’ అని పేర్కొన్నారు.