Rahul Gandhi Demads on Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేపర్ లీక్లు దేశ విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని, లక్షలాదాది మంది యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, కృషి వృధా అయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రం ఆగ్రహంతో ఉన్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి మాత్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు 80 సార్లు పేపర్ లీక్స్ జరిగాయని, సుమారు 2 కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, విద్యా వ్యవస్థలో ఒక విస్తృతమైన నెట్వర్క్ ఫలితమే అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
ఆర్ఎస్ఎస్-బీజేపీ విద్యావ్యవస్థను నాశనం చేసింది..
ఆర్ఎస్ఎస్, బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని విశ్వవిద్యాలయాకు ఛాన్స్ లర్లుగా నియమించడం విద్యా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ విద్యావ్యవస్థను నాశనం చేసిందని, ఎన్డీఏ పాలనలో విద్యా వ్యవస్థ కేవలం డబ్బు సంపాదించే సాధనంగా మారిందన్నారు. పేపర్ లీక్లో ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ పాలనలో పదే పదే జరుగుతున్న పేపర్ లీక్స్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్నారు.

