Railway Approval: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీని అందించే దిశగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి, కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య అత్యంత ముఖ్యమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ.112 కోట్లు.
రాజధాని రోడ్డుకు అనుసంధానం
ఈ ఆర్వోబీ నిర్మాణం రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే… జాతీయ రహదారి నుంచి రాజధానిలోని ముఖ్య రహదారి అయిన ఈ13 రోడ్డును నేరుగా అనుసంధానించడానికి ఈ వంతెన మార్గం సుగమం చేస్తుంది. నిర్మాణం ముఖ్యంగా మంగళగిరిలోని డాన్బాస్కో స్కూల్ సమీపంలో జరగనుంది.
భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ ఈ ఆర్వోబీని ఆరు లైన్లతో నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆరు లైన్ల నిర్మాణం కారణంగా ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాకుండా, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన ఈ ఆర్వోబీ నిర్మాణం త్వరలోనే ప్రారంభమై, రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.ఈ ఆమోదంతో, మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.


