Rain Alert for AP: భానుడి ప్రతాపంతో ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర వాసులకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చల్లని కబురు అందించింది. రానున్న 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-comments-on-neet-paper-leak/
కాగా, ఈ నెల 16 నాటికి నైరుతి పవనాలు అండమాన్కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. వీటి రాకతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది.
ప్రస్తుతం నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. వచ్చే 48 గంటల్లో ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అదేవిధంగా ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కి.మీ ఎత్తు వరకు ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. ఈ ప్రభావంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది.
Also Read: https://teluguprabha.net/telangana/acb-court-summons-former-minister-ktr-in-formula-e-car-race/
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధికంగా 42డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

