కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ తక్షణమే చర్యలు తీసుకున్నారు. విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
సోమవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో, కొందరు వైద్యులు మరియు సిబ్బంది హాజరు నమోదు చేసుకుని తమ కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. మంత్రి హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించగా, కొందరు హాజరు నమోదు చేయకపోవడం, కొందరు హాజరు నమోదు చేసి వెంటనే వెళ్లిపోవడం, మరికొందరు సమస్యలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం వెల్లడైంది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న మంత్రి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా, బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బంది పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఈఎస్ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం లేదా క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించమని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామన్డనారు.
ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, అన్ని వైద్య సిబ్బంది, ఆసుపత్రి సిబ్బందిని తమ విధులను నిబద్ధతతో, సతప్రవర్తనతో నిర్వహించాలని, ఈఎస్ఐ పథకం కింద లబ్ధిదారుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.