Reliance investment in AP Kurnool: ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ రానుంది. అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఆహార పరిశ్రమ రంగంలో రూ.40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఓ పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధమైంది. కాగా, ఇప్పటికే వివిధ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న రిలయన్స్ సంస్థ వేగంగా విస్తరిస్తున్న కన్జూమర్ ప్రొడక్ట్స్ రంగం పైనా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఏజీఎంలో పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికను బయటపెట్టింది. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన కటోల్లో ఫుడ్, బేవరేజెస్ యూనిట్లను రూ.1500 కోట్లతో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలులో రూ.768 కోట్లతో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రిలయన్స్ ఫుడ్ పార్కు ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. హైదరాబాద్ నగరానికి, అలాగే బెంగళూరుకు సమాన దూరంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని రిలయన్స్ ఎంచుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో మూడు గంటలు సమయం పడుతుంది. అలాగే బెంగళూరు వెళ్లేందుకు ఐదు గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన నగరాలతో అనుసంధానంలో ఉండొచ్చనే ఆలోచనతోనే కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణపల్లి వద్ద రిలయన్స్ ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఫుడ్ పార్కులో చాకోలెట్స్, స్నాక్స్, నూడుల్స్, అట్టా, మసాలాలు వంటి వస్తువులు తయారు చేయనున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ycp-mlc-ramesh-yadav-comments/
కన్జూమర్ రిటైల్ రంగంలో పాగా వేసేందుకు ప్రణాళిక..
కాగా, కన్జూమర్ రిటైల్ వ్యాపార విభాగంలో తనదైన ముద్ర వేసేందుకు రిలయన్స్ దూకుడుగా ముందుకెళ్తోంది. కాంపా, ఇండిపెండెన్స్ పేరుతో కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను ఇప్పటికే విక్రయిస్తోంది. ఇతర కన్జూమర్ ప్రొడక్టులను సైతం మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ట్యాగ్జ్ ఫుడ్స్ వంటి బ్రాండ్లనూ కొనుగోలు చేసింది. రాబోయే ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీగా అవతరించడంతో పాటు విదేశాలకూ విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్తో పాటు ఇతర కన్జూమర్ కేటగిరీల్లో విస్తరణకు బ్లూప్రింట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.


