Sajjala: ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత, అన్నదాతల సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. ‘అన్నదాత పోరు’ పేరిట ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు.
Read Also: Neymar: ఫుట్ బాల్ స్టార్ కు రూ. వేల కోట్లు రాసిచ్చేసిన బిలియనీర్..!
చంద్రబాబుపై విమర్శలు
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎరువుల కొరతను సృష్టిస్తోందని సజ్జల ఆరోపించారు. “కొరత లేదని చెబుతూనే రైతులను క్యూ లైన్లలో గంటల తరబడి నిలబెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎరువులను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ మాఫియాను నడిపిస్తున్నారు” అని ఆయన విమర్శించారు. తమ సమస్యలపై ప్రశ్నించిన రైతులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కూడా సజ్జల మండిపడ్డారు. “యూరియా వాడితే కేన్సర్ వస్తుందంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. సంక్షోభం సృష్టించి లబ్ధి పొందడమే చంద్రబాబుకు తెలుసు” అంటూ సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న తలపెట్టిన ‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Trump: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోయా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
నియంతృత్వ పాలన నడుస్తోంది..
సజ్జల మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. రైతులు యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సీఎం మాట్లాడతారా?. రైతులను బెదిరించటం, తొక్కుతాం, నారతీస్తాం అంటారా?. రైతులంటే అంత చిన్న చూపేంటి?. ఈ ప్రభుత్వ మెడలు వంచేంత వరకు వైఎస్సార్సీపీ పార్టీ వెనుకడుగు వేయదు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తాం. ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతాం. రాష్ట్రంలో ఇప్పటికి 60 శాతం సాగు కూడా కాలేదు. కానీ, ఎక్కడా యూరియా మాత్రం అందటం లేదు. యూరియాను టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్కు తరలించుకున్నారు. సమస్యను సృష్టించి, అందులో నుంచి దోపిడీ చేయటం టీడీపీ నేతలకు బాగా తెలుసు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏవీ అందటం లేదు. ఎరువుల కొరత లేదంటున్న చంద్రబాబుకు రైతుల క్యూలు కనపడటం లేదా?. కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కనపడటం లేదా?. మిర్చి, పొగాకు, మామిడి రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు. వైఎస్ జగన్ వెళ్తే హడావుడిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఉల్లికి ధర లేదని వైసీపీ నేతలు వెళ్తే మళ్లీ హడావుడి చేశారు. ఇదేమైనా నియంతృత్వ పాలనా?. యూరియా అడిగితే బెదిరించే సీఎంని ఇప్పుడే చూస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


