SEBI expert Challa Deviprasad: దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెరగాలని సెబీ నిపుణులు చల్లా దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల వారోత్సవం (వరల్డ్ ఇన్వెస్టర్స్ వీక్) సందర్భంగా విశాఖపట్నంలోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక మార్కెట్లలో పారదర్శకతకు, పెట్టుబడిదారుల భద్రతకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఇ) తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు.
ఒడిదుడుకుల్ని గమనిస్తూ ఉండాలి: మేనేజ్మెంట్ కోర్సుల్ని అభ్యసించే వారు ఫైనాన్సియల్ లిటరసీ, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై అవగాహనతో పాటు మార్కెట్ల ఒడిదుడుకుల్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని చల్లా దేవీ ప్రసాద్ సూచించారు. సెక్యూరిటీస్ మార్కెట్లలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. పెట్టుబడుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సైతం ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక అంశాలపై నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ తరఫున బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎకౌంటింగ్, ఫైనాన్స్ విభాగాధిపతి డాక్టర్ జీవీకే కస్తూరీ అధ్యక్షత వహించారు.


