కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితోఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ‘తల్లికి వందనం'(Thalliki Vandanam) పథకం ప్రారంభించింది. ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 67,27,164 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ఒకటో తరగతి పిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులకూ తల్లికి వందనం అమలు చేయనుంది.
అయితే ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం రూ.15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది.
మిగిలిన రూ.2వేలను పాఠశాలల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే ఖాతాలకు జమ చేస్తారని వెల్లడించింది.
కాగా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అమ్మ ఒడి కింద అందజేసిన రూ.15వేలలో పాఠశాల నిర్వహణ కోసం రూ.1000, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000 మినహాయించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది.
తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు.
* పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు లోపు ఆదాయం ఉండాలి.
* కుటుంబసభ్యుల్లో ఒకరి మీద రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి.
* మాగాణి మూడు ఎకరాలలోపు, మెట్ట 10 ఎకరాల లోపు ఉన్నవాళ్లే అర్హులు.
* నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
* ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోకు మాత్రం మినహాయింపు.
* నెలకు విద్యుత్ వాడకం సగటున 300 యూనిట్లు మించకూడదు.
* పట్టణాలు, నగరాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు.
* పింఛన్ (రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి) తీసుకునేవారు అనర్హులు.
* ఐటీ (ఇన్కమ్ ట్యాక్స్) ఫైల్ చేసేవారికి ఈ పథకం వర్తించదు.
