వేసవి సెలవులు కావడంతో పిల్లలు, యువకులు సరదా కోసం నదులు, చెరువులు, బావుల్లో ఈత కొడుతూ సేద తీరుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ సరదా ప్రాణాలపైకి తీసుకువస్తోంది. ఇప్పటికే అనుకోని ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చిత్తూరు(Chittoor)జిల్లాలో ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది.
జిల్లాలోని వి.కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురి విద్యార్థులు సరదాగా చెరువులో ఈతకు(Swimming) దిగారు. అయితే చెరువులో నీరు లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన తోటి విద్యార్థులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరో విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మృతులను కుషాల్, నిఖిల్, జగన్ గా గుర్తించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉండటంతో వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.