Sugavasi Balasubrahmanyam joins in YCP: ఓవైపు కూటమి ప్రభుత్వం తనదైన ముద్రతో పాలన కొనసాగిస్తుంటే.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య వర్గపోరు ఎక్కువుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఇది పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయిన తరుణంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.
ఇప్పటివరకు వైసీపీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరారు. అయితే ఇటీవల టీడీపీకి చెందిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. రాజంపేట నియోజకవర్గంలో తనకు అవమానాలు తట్టుకోలేక టీడీపీని వీడి వైసీపీలో చేరానని ఆయన తెలిపారు.
కాగా బాలసుబ్రమణ్యం తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు టీడీపీ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లో 1995లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గానూ పని చేశారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఓడిపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ నుండి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. అయితే టీడీపీ నేతలే తనను ఓడించారని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తనకు ప్రాధాన్యత ఉండటం లేదని.. అడుగుడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసిన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Sugavasi Balasubrahmanyam: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES