వేసవి కాలం మొదలైంది. అప్పుడే ఎండలు(Summer Heat) దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు భగభగమంటున్నాడు. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే మూడు రోజులు ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 3,4,5 తేదీల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ఎండలు మండిపోతాయని పేర్కొంది.
పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఎండా కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొదని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత చిన్న పిల్లలు, వృద్దులు, గుండెజబ్బులు, అనారోగ్యంగా ఉన్న వారు బయటికి వెళ్లొద్దని సలహా ఇస్తున్నారు. అత్యవసర పనులుంటే ఉదయం 11 గంటల లోపు.. సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని సూచించారు.