Sanjay Vs Supreme Court: ఏపీ సీఐడీకి మాజీ డైరెక్టర్గా పనిచేసిన సంజయ్కు సుప్రీంకోర్టు మరోసారి ఎదురు దెబ్బ కొట్టింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ, సంజయ్పై కఠిన వ్యాఖ్యలతో తీర్పు వెల్లడించింది. గురువారం నాడు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, సంజయ్కు మూడు వారాల గడువు ఇచ్చి, ఈ వ్యవధిలో కోర్టుకు లొంగిపోవాలని స్పష్టంగా చెప్పింది.
ప్రధాన నిందితుడిగా..
అగ్నిమాపక శాఖలో జరిగిన అవినీతి కేసులో సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసు నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు నుంచి సంజయ్ ముందస్తు బెయిల్ పొందగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సాగిన వాదనలు, విచారణల అనంతరం కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.
నమ్మశక్యం కాదు..
తీర్పులో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విధానంపై ప్రశ్నలు లేవనెత్తింది. బెయిల్ దశలోనే విచారణ పూర్తయినట్లుగా హైకోర్టు తీర్పు ఉండటం పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే రకమైన సమాచారం, అన్ని సదస్సుల్లో ఖచ్చితంగా 350 మంది హాజరయ్యారన్న వివరాలు చూసి, కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సమానంగా హాజరు ఎలా సాధ్యమవుతుందని, ఇది నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది.
ఈ కేసుకు సంబంధించి సంజయ్పై అరెస్టు వాడంట్ ఇవ్వకుండానే ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సరైన ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థ మేజిస్ట్రేట్ కోర్టులో సంజయ్ కస్టడీకి పిటిషన్ వేయవచ్చని, అదే సమయంలో సంజయ్ కూడా అదే కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
దాదాపు 60 లక్షల బిల్లులు..
అవినీతికి సంబంధించిన ప్రధాన అంశాలు ప్రభుత్వ విభాగాల సమర్పించిన నివేదికల్లో బయటపడ్డాయి. అగ్నిమాపక శాఖలో ఎన్వోసీలు ఆన్లైన్లో జారీచేసేలా ‘అగ్ని-ఎన్వోసీ’ అనే వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి చేసేందుకు, ట్యాబ్లెట్లు సరఫరా చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించబడింది. అయితే సంస్థ ఎటువంటి పనులు చేయకుండానే దాదాపు 60 లక్షల బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదే తరహాలో మరో సంస్థకు అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో కాంట్రాక్టు ఇచ్చారు. దళితులు, గిరిజనుల కోసం SC, ST చట్టంపై అవగాహన పెంచే కార్యక్రమాల పేరుతో 1.19 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపారు. కానీ ఆ సంస్థ సదస్సులు నిర్వహించకపోయినా బిల్లుల రూపంలో డబ్బులు తీసుకెళ్లినట్టు వివరాలు లభించాయి. వాస్తవానికి అవగాహన కార్యక్రమాలు సీఐడీ అధికారులు స్వయంగా నిర్వహించారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ రెండు వ్యవహారాల్లో కలిపి ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిపింది. ఈ నివేదికల ఆధారంగా ఏసీబీ సంజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ, దానిపై ప్రభుత్వ అభ్యంతరాల్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, బెయిల్ మంజూరు ప్రక్రియలో సరైన తర్కం పాటించలేదని పేర్కొంది. నిందితుడు ఎలాంటి విచారణకు లోనవ్వకముందే బెయిల్ మంజూరు చేయడం విచారణను దెబ్బతీసే విధంగా ఉందని స్పష్టంగా తెలిపింది.
తుదకు సుప్రీంకోర్టు సంజయ్కు ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ, మూడు వారాల్లో కోర్టుకు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. తదుపరి చర్యల కోసం మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఈ తీర్పుతో సంజయ్ కేసులో కొత్త మలుపు తిరిగినట్లయింది.


