Jagan assets | జగన్ అక్రమాస్తుల కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం సీబీఐ, ఈడీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని సూచించింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలను ఇవ్వాలని తెలిపింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని చెప్పింది. సీబీఐ, ఈడీ కేసులు వివరాలు విడివిడిగా చాట్ రూపంలో అందించాలని సూచించింది. అన్ని వివరాలతో రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 13 కి వాయిదా వేసింది.
కాగా, వైఎస్ జగన్ అక్రమాస్తుల (Jagan Illegal assets) కేసు విచారణ లేటవుతోందంటూ రఘురామకృష్ణ రాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం నేడు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… ఇప్పటికే రోజువారి పద్ధతిలో విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించగా.. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టులో విచారణ పెండింగే కారణమని వివరించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని పేర్కొంది.