తిరుపతి (Tirupati) నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్(Deputy Mayor)గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్రెడ్డికి 21 మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 50మంది కార్పొరేటర్లకు గాను 47మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను సోమవారం ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక నేటికి వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో తిరుపతిలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ గురుమూర్తి వెళ్తున్న బస్సుపై కూటమి నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత అర్థరాత్రి టీడీపీ నేత ఇంటిపై వైసీపీ యువనేత అభినయ్ రెడ్డి దాడి చేశారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం(MLC Subramanyam) అదృశ్యమైనట్లు వార్తలు షికార్లు చేశాయి. అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ సుబ్రహ్మణ్యం ఓ వీడియో విడుదల చేశారు. మొత్తానికి డిప్యూటీ మేయర్ ఎన్నిక తిరుపతిలో కాక రేపింది. చివరకు అధికార టీడీపీనే డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకుంది.