TDP gives green signal to Nagababu: ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండటంతో నాగేంద్ర బాబు ఎచ్చెర్లను ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు జనసేన పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనకు ఎచ్చెర్లలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తింపజేసింది. ఇదిలా ఉండగా నాగేంద్ర బాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలున్నాయి. 2019, 2024 ఎన్నికల సమయంలో ఆయన నియోజకవర్గాల మార్పు, పోటీకి దూరంగా ఉండటంపై తీవ్ర చర్చలు నడిచాయి. 2019 ఎంపీ ఎన్నికల్లో నాగబాబు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ స్థానం నుండి జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ప్లాన్..
2024 ఎన్నికల సమయంలో కూడా నాగబాబు మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ముందుగా ఆయన అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అక్కడ పర్యటనలు కూడా చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తుల వల్ల సమీకరణాలు మారిపోయాయి. అనకాపల్లి స్థానాన్ని బీజేపీ నుంచి సీఎం రమేష్కు కేటాయించాల్సి వచ్చింది. ఇక, 2025 మార్చిలో ఆయన ఎమ్మెల్యే కోటాలో కూటమి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

