Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Amaravathi: ఎపిలో సంక్షేమ కార్యక్రమాలు భేష్

Amaravathi: ఎపిలో సంక్షేమ కార్యక్రమాలు భేష్

ఎన్డిసి ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పధకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్ మరియు ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ గుప్త పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కొంత మంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈసందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ మాట్లాడుతూ నేషనల్ డిఫెన్సు కళాశాల ఫ్యాకల్టీ-కోర్సు సభ్యులతో కలిసి రెండు రోజులుగా విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, మహిళా, రైతు సంక్షేమం పరంగా అమలు చేస్తున్న పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అక్కడి ప్రజలతో మాట్లాడడం జరిగిందని తెలిపారు.ఎన్డిసి బృందం దేశంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి ఆక్కడ ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పధకాలు,కార్యక్రమాలను పరిశీలించడం జరిగిందని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ సంక్షేమ పధకాలు అమలులో మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని కొనియాడారు. తమ పర్యటనకు తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి అన్ని విధాలా కృతజ్ణతలు తెలియజేస్తున్నట్టు మనీష్ కుమార్ గుప్త చెప్పారు.

- Advertisement -

ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళా, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. అదేవిధంగా ప్రాధమిక విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా విద్యా, వైద్య పరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్డిసి బృందానికి వివరించారు.అంతేగాక పేద ప్రజల సంక్షేమానికి గతంలో పలు వినూత్న కార్యక్రమాలు, పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.


అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు.ముఖ్యంగా విద్యాపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇటీవల కాలంలో చేపట్టిన చర్యలు,ఆంగ్ల విద్యాబోధన,ఐబి జాయింట్ సర్టిఫికేషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జిఇఆర్)వృద్ధికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఎన్డిసి బృందానికి వివరించారు.
ఎపి ట్రాన్సుకో సియండి కెవిఎస్ చక్రధర బాబు రాష్ట్రంలో ఇంధన శాఖకు సంబంధించిన అంశాలపై వివరిస్తూ ప్రజలకు 24 గంటలూ యాక్ససబుల్ మరియు రిలయబుల్ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఎపి జెన్కో ద్వార ఏడాదికి 19వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం జరుగుతోందని చెప్పారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు.ఎస్సి,ఎస్టి విద్యుత్ వినియోగదారులు సుమారు 20 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని ఇందుకై ఏటా 600 కోట్ల రూ.లను ప్రభుత్వం వెచ్చించడం జరుగు తోందని తెలిపారు.చేతి వృత్తుల వారికి 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.ఒకే దేశం ఒకే గ్రిడ్ నినాదంలో భాగంగా విద్యుత్ ఉత్పత్తికి సంబందించి పలు చర్యలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. 5 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని,5 పంపు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వ్యవసాయంతో పాటు ఆక్వారంగానికి కూడా విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇంధన రంగంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈఏడాది 4 జాతీయ,3 అంతర్జాతీయ అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డును కూడా సాధించడం జరిగిందని తెలిపారు.

వ్యవసాయశాఖ ఇన్చార్జి కమీషనర్ జి.శేఖర్ బాబు వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర జిడిపిలో 34 శాతం పైగా వాటా వ్యవసాయ రంగం నుండి వస్తోందని చెప్పారు.అరటి,కోకో వంటి ఎగుమతుల్లో ఎపి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు.రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన వివిధ సేవలన్నిటినీ ఒకే చోట నుండి అందిస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే ఆదే పంటకాలంలో రైతులకు అవసరమైన ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఉచిత పంటల బీమాను వర్తింప చేయడం జరుగుతోందని,వ్యవసాయ రంగంలో డ్రోన్లను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అలాగే ఉద్యానవన, పశుసంవర్ధక, ఆక్వా రంగాల్లో కూడా అనేక విధాలుగా రైతులను ఆదుకునేందుకు పలు పధకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు వివరించారు.
రాష్ట్రంలో వైద్య పరంగా చేపట్టిన అభవృద్ధి, సేవలను రాష్ట్ర సెకండరీ హెల్తు డైరెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎన్డిసి బృందానికి వివరిస్తూ రాష్ట్రంలో వైద్య పరమైన మౌలికి సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామ స్థాయి వరకూ గల ఆరోగ్య కేంద్రాలను పూర్తిగా పటిష్టవంతం చేయడం జరిగిందని చెప్పారు.గతంలో ఎన్నడూ లేని విధంగా 53 వేల వివిధ పోస్టులను భర్తీ చేయడం తోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం,జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటివద్దకే మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి జరుగుతోందని వివరించారు. ఆరోగ్య శ్రీ పధకం ద్వారా 91 శాతం పైగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యల తీసుకోవడం తోపాటు ఆరోగ్యశ్రీ పధకం పరిమితి 5లక్షల రూ.ల నుండి 25 లక్షల రూ.లకు పెంచడం జరిగిందని తెలిపారు. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. కోవిడ్ సమయంలో ప్రజలకు పరీక్షలు, చికిత్సలు, ఇంజక్సన్లు వేయడం వంటి సేవల్లో ఎపి దేశానికై ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు.

అనంతరం పలువురు ఎన్డిసి ప్రతినిధులు రాష్ట్రంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పధకాలపై వారికి గల సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇంకా ఈసమావేశంలో నేషనల్ డిపెన్సు కళాశాల ఫ్యాకల్టీ మరియు కోర్సు సభ్యులు బ్రిగేడియర్లు బిఎస్ జస్రోషియా (Jasrotia), ఎన్ఎం బెండిగెరి, ఆర్ఎస్ దాద్వాలే, అక్షయ్ శర్మ, ఆర్.గులాటి, బ్రిగేడియర్ జనరల్ లు ఎండిఎస్ రెహమాన్, చర్చిల్ మూంగా(Moonga), ఎయిర్ కమాడోర్ రత్నేష్ గుప్త,వినయ్ ప్రతాప్ సింగ్, డిఐజి ప్రతీక్ థపిలియాల్(Thapliyal), కల్నల్ లు జాన్సన్ హెచ్.మెటెనే(Motene), మొహమ్మద్ సలాహి ఎఫ్ అల్దూసరి(Aldousari), సైమన్ మహేంగే అనాంజే(Mahenge Anange), కెప్టెన్ కాసే స్కల్లీ ఓ షేయా(Casey Scully O Shea), నవనీత్ మనోహర్, రవీంద్ర కె, డి.శ్రీనివాసరావు ,పి. చిన్న ముక్కంటి, ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News